ద్విపదభాగవతం - మధురకాండ : బలరామకృష్ణులు నిప్పులోమాడిరని తలఁచి జరాసంధుఁడు మఱలిపోవుట
నాలో జరాసంధుఁడా గోపవరులఁ
గాలి చచ్చిన వారిగా నిశ్చయించి
యగణితంబగు సేనలన్నియుఁ గొలువ
మగధదేశమునకు మగుడ నేతెంచె,
అక్కడ గోవిందుఁ డఖిలబాంధవులుఁ
దక్కక తనుఁ గొల్వ ద్వారకాపురిని
నానకదుందుభి యనుమతి నుగ్ర
సేనుఁడు తనపంపు సేయ సామ్రాజ్య
కలనంబునకుఁ దానె కర్తయైపేర్చి
బలభద్రుఁ గూడి నిర్భయవృత్తినుండె.
మధురలోపల శత్రుమథనంబు సేసి
మధువైరి విహరించు మహనీయకథలఁ
దాత్పర్యమున విన్న ధన్యచిత్తులకు
సత్పుత్రలాభంబు శత్రుజయంబుఁ
గమనీయదర్మార్థకామమోక్షములు
సమకూరి హరిభక్తి సౌఖ్యంబ నొందు”
నని చెప్పుటయు “వీని ననఘునిచేత
విని కృతార్థుఁడనైతి వివిధసంపదల
హరి యెట్లు విహరించె నట మీఁది కథలఁ
బరిపాటితోడ నేర్పడఁ జెప్పు”మనిన
నమ్మహీశ్వరునకు నభిమన్యుసుతుకు. - 680
నమ్మహాయోగి యిట్లని చెప్పఁ దొడఁగె.
అని యిట్లు నయనిర్జరామాత్యు పేర
ధనధాన్యమణిమయదానాఢ్యు పేర
భూభరణక్షమభుజసారు పేర
ఔభళమంత్రి కందామాత్యుపేరఁ
గోరి భారద్వాజగోత్రసంజాతుఁ
డారూఢమతి నయ్యలార్యనందనుఁడు
శృంగారరసకళాశ్రితవచోధనుఁడు
సింగయామాత్యుఁడు చెలువగ్గలింప
సలలితరసభావశబ్దగుంభనల
వలనొప్ప శ్రీ భాగవత పురాణమున
మహనీయమగు దశమస్కంధసరణి
విహితలీలల నొప్పు విష్ణుచరిత్రఁ
బ్రాకటంబగు మధురాకాండ మనిన
నాకల్పమాకల్పమగు భంగిఁ జెప్పె.